విద్రోహులపై వార్-6గురి కాల్చివేత
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లా డివిజన్ పరిధిలోని నిమ్మపల్లి-మర్రిమడ్ల మధ్య అటవీప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం కోవర్ట్ సభ్యులుగా గుర్తించిన ఆరుగురిని పీపుల్స్వార్ నక్సలైట్లు కాల్చి చంపారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 12 మంది కోవర్ట్ సభ్యులను (నక్సలైట్లుగా నక్సలైట్ దళాల్లో చెలామణి అయ్యే పోలీసు ఏజెంట్లను) వార్ నక్సలైట్లు బంధించారు.
ఉత్తర తెలంగాణా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ఆజాద్ శుక్రవారం నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు అడవుల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయా సభ్యులు పోలీసు కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా దళాల్లోకి ఎలా ప్రవేశించారో వివరించారు. తాము కోవర్ట్ ఆపరేషన్ను అమలు పరిచి పలు ఎన్కౌంటర్లు చేయించిన విధానాన్ని పీపుల్స్వార్ నిర్బంధంలో వున్నవారు వివరించారు. ఈ 12 మందిలో ఆరుగురిని శుక్రవారం మధ్యాహ్నం పీపుల్స్వార్ నక్సలైట్లు దారుణంగా కాల్చి చంపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వార్ తన అంతర్గత శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంది. తమ అగ్రనేతలను చంపడానికి కుట్ర పన్నారంటూ పీపుల్స్వార్ వీరిని గత మూడు రోజులుగా నిర్బంధించింది.
ఉత్తర తెలంగాణా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ఆజాద్తో పాటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల కమిటీ సభ్యులు రమేష్, అయిలన్న, స్వామి, తదితర నక్సలైట్ నేతనలు హతమార్చి ఆయుధాలు ఎత్తుకుపోయేందుకు పథకం పన్నినట్లు పీపుల్స్వార్ ప్రకటించింది. విద్రోహ చర్యలకు పాల్పడ్డారంటూ తాము నిర్బంధించిన 12 మందిని ఆజాద్ విలేకరులకు చూపించారు. వారి పేర్లు, చిరునామాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం సనుగులకు చెందిన రెడ్డి, అశిరెడ్డిపల్లికి చెందిన ప్రభాకర్, జోగాపూర్కు చెందిన కొండా శ్రీనివాస్ అలియాస్ రాంచంద్రగౌడ్, కోనరావుపేటకు చెందిన కొమ్ము శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ధన్నూర్కు చెందిన మాజీ కమాండర్ అజయ్, నిజామాబాద్ జిల్లా మానాలకు చెందిన శంకర్, దశరథ్, ఫరంగి, లింబ, గజన్లాల్, చిన్న ఫరంగిలు ఇందులో వున్నారు.
వార్ నేతలు ఆజాద్, రమేష్, అయిలన్న, స్వామిలను చంపేందుకు మూడు సార్లు ప్రయత్నించినట్లు వారు విలేకరులతో చెప్పారు. ఒకసారి గ్రేనేడ్ వేయాలని యత్నించి విఫలమయ్యాం. ప్రతిసారి మాలోనే ఎవరో ఒకరు సెంట్రీగా వుండి అగ్రనేతలతో సహా మొత్తం దళాన్ని మట్టుబెట్టడానికి యత్నించాం. గత కొంత కాలంగా మేం తరచూ పోలీసులను కలుస్తూవచ్చాం. డబ్బులు తీసుకుని పంచుకున్నాం. డబ్బుకు ఆశపడి పోలీసులకు ఏజెంట్లుగా మారాం అని వారు వివరించారు. తాము పోలీసుల నుంచి ఎప్పుడు ఎంతెంత తీసుకుందీ, ఎవరెవరి ఆచూకీ చెప్పిందీ వారు వివరించారు. వారు ఇవన్నీ చెప్పిన తర్వాత విలేకరులను వార్ నేతలు అక్కడి నుంచి పంపివేశారు. ఆ తర్వాత అందులో ఆరుగురిని కాల్చి చంపి రోడ్డుకు ఇరు వైపులా శవాలనుపారేశారు.