ఆహార రంగంలోపెను సంక్షోభం
చెన్నై: ఆహార భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరైన పథకాలతో తగిన చర్యలు తీసుకోని పక్షంలో మరో 20 ఏళ్లలో తీవ్రమైన క్షామం ఏర్పడే అవకాశం వున్నదని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ హెచ్చరించారు. చెన్నైలో ఆహారభద్రతపై ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు చిన్నరైతుల జీవితాలను ధ్వంసం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నేడు కనీసం 100 కోట్ల మంది ప్రజలు ఆకలితో లేదా అర్ధాకలితో అలమటిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. దేశంలోని రైతులకు ఇంతవరకు మౌలిక సదుపాయాలే ప్రభుత్వం సరిగ్గా కల్పించలేకపోయిందని ఆయన అన్నారు. మరోవైపు గ్లోబలైజేన్ తాకిడివల్ల వ్యవసాయం రంగంలోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ కొత్త కార్పొరేట్ వ్యవసాయంలో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడలేక గ్రామీణ భారతంలోని వేలాది మంది రైతులు ఘోరమైన పరిస్థితిని ఎదుర్కోవల్సివస్తుందనిఆయన తెలిపారు.
గిట్టుబాటు ధరల దగ్గరనే మార్కెటింగ్ సమస్యలు తలెత్తుతున్నాయని స్వామినాథన్ అన్నారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిష్కుమార్ కూడా మాట్లాడారు.