50 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు హీట్ వేవ్ హెచ్చరిక!
దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు, మండుటెండలు ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటంతో వాతావరణ శాఖ (IMD) అనేక రాష్ట్రాల్లో హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ఆరు రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
తెలంగాణలో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే స్థితి ఏర్పడింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట్ వంటి జిల్లాల్లో మరో మూడు రోజులు రెడ్ అలర్ట్ హెచ్చరికలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నేడు 14 జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

నేడు హీట్ వేవ్ హెచ్చరికలు ఉన్న జిల్లాలివే
ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట్ జిల్లాల్లో 45 డిగ్రీలు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రామగుండం 44.6, నిజామాబాద్ 44.4, ఆదిలాబాద్ 44.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అంచనా వేశారు. హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రత సుమారు 39.5 డిగ్రీలుగా ఉన్నా, ఉక్కపోత తీవ్రంగా ఉంది. రాబోయే రెండు రోజుల్లో మరో 1-2 డిగ్రీలు పెరిగే చాన్స్ ఉంది.
తెలంగాణా రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం
మే 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ అలర్ట్ కొనసాగనుంది. దక్షిణ తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా తెలంగాణా రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు మరో మూడు రోజులు ఉండవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో ఎండల దాడి
ఏపీలో కూడా ఎండల తీవ్రత భారీగా ఉంది. రానున్న నాలుగు రోజులు మరింత వేడి పెరిగే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు చేసే అవకాశం ఉంది .
ఏపీలో ఎండల దెబ్బకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి
విజయనగరం, మార్కాపురం ప్రాంతాల్లో 44-45 డిగ్రీలు, మిగిలిన జిల్లాల్లో 40-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రెడ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా అనేక ప్రాంతాలకు జారీ చేశారు.ఎండల దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుండే భానుడు భగ్గుమన్నాడు. పగటిపూట బయటకు వెళ్లడం కష్టంగా మారింది.
ఎండల వేళ జాగ్రత్త
రాత్రి సమయంలో కూడా వేడి తగ్గకపోవడంతో నిద్ర సరిగా పట్టడం లేదు. వాతావరణ శాఖ సూచనలు పాటించి, పగటి వేళల్లో ఎక్కువగా ఇంటి వద్దే ఉండాలని, నీరు తగినంతగా తాగాలని, ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వేసవి మరింత తీవ్రంగా మారుతుండటంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి.ప్రజలను అలెర్ట్ చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications