మోదీ కొత్త టీంలో తెలంగాణ నుంచి ఊహించని మార్పులు - ఇన్ .. అవుట్..!?
తెలంగాణ బీజేపీలో కీలక అప్డేట్. కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రధాని మోదీ కేబినెట్ లోని అందరు మంత్రులతో ఈ రోజు భేటీ కానున్నారు. అందరూ ఢిల్లీలో ఉండాలని నిర్దేశించారు. ప్రభుత్వం- పార్టీలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల పైన గురి పెట్టిన బీజేపీ.. అందుకు అనుగుణంగా నిర్ణయాలకు సిద్దం అవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించింది. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి మార్పులు - చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. తెలంగాణ నుంచి కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో దాదాపు 30 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది. కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నిక లు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి, బండి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరిలో ఒకరిని పార్టీ సేవలకు వినియోగించుకునే ఆలోచనలో పార్టీ అధి నాయకత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా తెలంగాణ సామాజిక - రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని మరో ఇద్దరికి కొత్తగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఇవ్వటం దాదాపు ఖాయమైంది. కొత్తగా మంత్రుల రేసు లో డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ ఉన్నారు. అయితే.. బండి సంజయ్ మంత్రి గా కొనసాగితే అర్వింద్ కు అవకాశం ఉండదని చెబుతున్నారు.

తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్
అదే విధంగా కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే డీకే అరుణకు మంత్రిగా ఛాన్స్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఈటల రాజేందర్ సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇక.. ప్రధాని మోదీ తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. బండి సంజయ్ స్థానం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. బండి సంజయ్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, తాజా ఘటనల వలన బండి పైన ఎలాంటి ప్రభావం ఉండదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా.. కిషన్ రెడ్డిని కొనసాగిస్తే.. శాఖ మార్పు ఉంటుందని ఢిల్లీ నేతల సమాచారం. అయితే.. ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రుల సంఖ్య మార్పులు.. చేర్పులతో మూడుకు చేరుతుందని చెబుతున్నారు. దీంతో.. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని మోదీ మంత్రులతో భేటీ తరువాత.. తాజా ఆలోచనల పైన పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications