విపక్షాల అభిప్రాయం అక్కరలేదా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ నేత జనరల్ ముషారఫ్తో ప్రధాని వాజ్పేయి జరుపనున్న శిఖరాగ్ర చర్చలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్షాలతో మాటమాత్రంగానైనా సంప్రదింపులు జరపకపోవడాన్ని సిపిఎం తీవ్రంగా ఆక్షేపించింది. పాకిస్తాన్ పాలకుడు ముషారఫ్ గత పదిరోజులుగా ఇస్లామాబాద్లో మేధావులు, పత్రికాసంపాదకులు, రాజకీయపార్టీల నేతలు, మతనాయకులతో వరుసగా సమావేశమై మంతనాలు జరుపుతూ భారత్తో ప్రస్తావించాల్సిన విషయాలను ఖరారు చేస్తుంటే వాజ్పేయి ప్రభుత్వం మాత్రం శిఖరాగ్ర సభ కేవలం తమకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నదని సిపిఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు.
మేధావులు, సంపాదకులను సంప్రదించకున్నా కనీసం పార్లమెంటరీ సంప్రదాయాన్ని గౌరవించి ప్రతిపక్ష పార్టీలతోనైనా ముందుగా చర్చించాల్సిన బాధ్యతప్రభుత్వానికి లేదా ఆని ఆయన ప్రశ్నించారు. లాంఛనంగా శిఖరాగ్ర సభకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ప్రతిపక్ష పార్టీలకు కేంద్రం అందజేసిందని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్తో ప్రస్తావించదల్చిన విషయాలను భారత ప్రభుత్వం బయటకు వెళ్లడించడంతో పాటు ద్వైపాక్షిక అంశాల విషయంలో తన వైఖరిని వెల్లడించి దానిపై అంతర్గత చర్చకు అవకాశం ఇవ్వాలని ఏచూరి సూచించారు.