సిఎంపై దేశం ఎంపీలు గరం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిని వివరించేందుకు ప్రధాని వాజ్పేయితో జరిపిన సమావేశానికి తొలుత తమను ఆహ్వానించి ఆఖరు క్షణంలో అవసరం లేదని తమను వెనక్కి పంపించడం పట్ల తెలుగుదేశం ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆగ్రహంతో వున్నారు.
గురువారం మధ్యాహ్నం పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో వాజ్పేయితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారని తెలుగుదేశం ఎంపీలకు సమాచారంఅందింది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలంతా హాజరు కావాలని ఆహ్వానించారు. తెలుగుదేశం ఎంపీలు ప్రధాని కార్యాలయానికి వెళ్లి సమావేశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో టిడిపిపి డిప్యూటి నాయకుడు వేణుగోపాలాచారి వచ్చి ప్రధానితో సమావేశానికి పార్టీ ఎంపీలు అవసరం లేదని ప్రకటించారు. పార్టీ ఎంపీలను చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయడం పట్ల వారు తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నారు.