సంక్షోభంలో కృషి బ్యాంక్
హైదరాబాద్: ప్రారంభమైన రెండుమూడేళ్ల కాలంలోనే హైప్రొఫైల్ బాంక్గా విశేష ప్రచారంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసిన కృషిబాంక్ ఒక్కసారిగా సంక్షోభంలో చిక్కుకున్నది. డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేక బ్యాంకు మానేజర్ పోలీసు స్టేషన్లో ప్రాణాలు కాపాడుకుంటుండగా బ్యాంక్ డైరెక్టర్లు బ్యాంక్ దిశగా రావడానికి భయపడుతున్నారు.
బ్యాంకు చైర్మన్ వెంకటేశ్వరరావు అమెరికాలో వున్నట్టుగా చెబుతున్నారు. వందలాదిమంది చిన్నాపెద్ద డిపాజిటర్లు తమ కష్టార్జితంపై ఆందోళనతో వున్నారు. రాణిగంజ్లోని బ్యాంక్ ముందే అనేక మంది డిపాజిటర్లు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంక్ చైర్మన్ వెంకటేశ్వరరావు అమెరికా వెళ్లినట్టుగా చెబుతున్నారు. ఊరిలోనే వున్న బాంకు డైరెక్టర్లు డిపాజిటర్లను సముదాయించడానికి రావడానికి,వివరణ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
కృషి బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారిలో ఎన్ఆర్ఐలు వ్యాపారులు మాత్రమే కాకుండా పెన్షనర్లు కూడాపెద్దసంఖ్యలో వున్నారు. అధిక వడ్డీని కృషి ఆఫర్ చేయడంతో చాలా మంది తమ కష్టార్జితాన్ని బ్యాంకులోపెట్టుకున్నారు. గత వారం రోజులుగానే కృషి బాంకు గురించిపెద్దఎత్తున పుకార్లు మార్కెట్లో వ్యాపిస్తున్నా సకాలంలోవివరణ ఇవ్వడానికి బ్యాంకు వర్గాలు ప్రయత్నించలేదు. దాంతో శుక్రవారం వందలాది మంది డిపాజిటర్లు తమ సొమ్ము వెనక్కి తీసుకోవడానికి బ్యాంకు ముందు బారులు తీరారు. శుక్రవారం నాడు డిపాజిటర్ల వత్తిడిని తట్టుకున్న బాంకు అధికారులు శనివారం నాడు చేతులెత్తేశారు.
దాంతో డిపాజిటర్లు ఆందోళనకు దిగి ఒక దశలో బాంకు మానేజర్ పై చేయి చేసుకునే దాకా వెళ్లారు. పరిస్థితివిషమిస్తున్న విషయం గ్రహించిన బ్యాంకు సిబ్బంది వెళ్లి మహంకాళి పోలీస్స్టేషన్లో తలదాచుకున్నారు. ఆర్బిఐ అధికారులు కూడా ఎట్టకేలకు రంగంలోకి దిగారు. ఆర్బిఐ అధికారుల ఆదేశాల మేరకు బ్యాంక్ చైర్మన్కు సమాచారంఅందించారని తెలిసింది. వారం రోజుల క్రితమే ఆర్బిఐ నుంచి కృషిబ్యాంక్కు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలిసింది. ఈ బ్యాంక్ పనితీరువిషయంలో వారం రోజుల క్రితమే హెచ్చరికలు చేసిన ఆర్బిఐ ఇన్వెస్టర్లు, డిపాజిటర్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేయకపోవడం పట్లవిమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా వుండగా రెండు మూడేళ్ల కాలంలోనే 35 కోట్ల రూపాయలమేర డిపాజిట్లు సంపాదించిన కృషి బాంక్ సాధించిన ప్రగతిని చూసి గిట్టనివారే బ్యాంకుకు వ్యతిరేకంగా పుకార్లు వ్యాపింపజేశారని బ్యాంకు సన్నిహిత వర్గాలుఅంటున్నాయి. ఒక్కసారిగా వేలాది మంది డిపాజిటర్లు క్యూ కట్టితే ఎంతపెద్ద బ్యాంకుకైనా చెల్లింపులు కష్టమని వారుఅంటున్నారు. ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకోకుండా రుణాలు ఎలా ఇవ్వగలమని వారుఅంటున్నారు.