వాజ్పేయికి ఎన్డిఎ సంపూర్ణ మద్దతు
న్యూఢిల్లీ: ప్రపంచ ఉగ్రవాదంపై పోరు పట్ల ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డిఎ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మద్దతులో పరిమితులు ఏమీ వుండవని ఎన్డిఎ బుధవారం స్పష్టం చేసింది. సంకీర్ణంలో ఉన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఎన్డిఎ ఈ మద్దతు ప్రకటించింది.
ఇంత వరకు ప్రధాని చేపట్టిన చర్యలకు, ఇక ముందు చేపట్టబోయే చర్యలకు ఎన్డిఎ పరిమితులు లేని మద్దతు ప్రకటించిందని ఎన్డిఎ కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ చెప్పారు. ఈవిషయమై రెండు గంటల పాటు జరిగిన ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశం ఆ మేరకు ఒక ఏకగ్రీవ తీర్మానం ఆమోదించినట్లు ఆయనవిలేకరులతో చెప్పారు.
వాషింగ్టన్, న్యూయార్క్లలో దాడులు జరిగిన తర్వాత రాజకీయ, ఇతర విభేదాలనువిస్మరించి అమెరికా ప్రజలు ప్రదర్శించిన మద్దతును గుర్తు చేస్తూ మన జాతీయ జీవనంలోని అన్ని స్థాయిల్లో ఏకత అవసరమని సమావేశం ఏర్పాటు చేసిన వాజ్పేయి తన భాగస్వామ్య పక్షాలతో అన్నారు.
సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని అడిగితే- ఎన్డిఎలో విస్తృత విభేదాలున్నాయని మీడియా ప్రచారం చేస్తోందని, ఇటువంటి ప్రచారం లేకపోతే సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం వుండేది కాదని ఫెర్నాండెజ్ జవాబిచ్చారు. మీడియా భావించినట్లు విభేదాలు ఏవీ తలెత్తకుండానే తీర్మానం ఆమోదం పొందిందని ఆయన చెప్పారు.
ఉగ్రవాదంపై పోరు విషయంలో ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న చర్యలను విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ సమావేశంలోవివరించారని, భారత వైఖరిని వివరించేందుకు ఈ వారాంతంలో చేసే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ పర్యటనల గురించి కూడా చెప్పారని ఫెర్నాండెజ్ తెలిపారు. ఆ తర్వాత జస్వంత్ సింగ్ చైనా పర్యటన కూడా జరుపుతారని ఆయన చెప్పారు.
అమెరికాకు, పాక్కు మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి కూడా సమావేశంలో చర్చించారా అని ప్రశ్నించినప్పుడు సమస్యకు సంబంధించిన అన్ని కోణాల గురించి చర్చ జరిగిందని, ఉగ్రవాద వ్యతిరేక పోరులో ప్రపంచం ఒకటి కావడం శుభ పరిణామమని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications