దాడుల్ని ఖండించిన ముస్లిందేశాలు
దోహాః అమెరికా అంచనాలకు విరుద్ధంగా ఇస్లామిక్ దేశాల కూటమి ఆఫ్ఘన్ పై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించింది. 54 ముస్లిందేశాలకు చెందిన నేతలు ఆఫ్ఘన్ పై అమెరికా ప్రకటించిన యుద్ధ పరిణామాలను చర్చించేందుకు బుధవారం దోహాలో అత్యవసరంగా సమావేశమయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న 1.2 బిలియన్ల ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ఈ సంస్థ మరింత బలమైన సాక్ష్యాలు చూపించి అమెరికా దాడులు చేపడితే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా దాడులు అమాయకులైన ఆఫ్ఘన్ ప్రజలను బలికొనరాదని సంస్థ సూచించింది. ఈ వ్యవహారంపై ఐక్యరాజ్య సమితి సత్వరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇస్లామిక్ దేశాల సంస్థ కోరింది.
అమెరికా దాడుల వల్ల ఇప్పటికే దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ఆఫ్ఘనిస్తాన్సర్వనాశనం అవుతుందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను ఆదుకొనేందుకు అన్ని ముస్లిం దేశాలు ఉమ్మడిగా ఓ సహాయ నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పిచాయి. ఇరాన్ చొరవతో ఏర్పడిన ఈసమావేశం అమెరికా దాడులను ఖండించడంవిశేషం.