స్కాలర్షిప్ల మోసగాళ్ల అరెస్టు
బెంగుళూర్: స్కాలర్షిప్ల పేరుతో విద్యార్థులను మోసగిస్తున్నారనే ఆరోపణపై హైదరాబాద్లో స్థిరపడిన ఇద్దరిని బెంగుళూర్ ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. ఈ నిందితులను అరెస్టు చేయడంతో మూడు కోట్ల రూపాయల మోసానికి తెర పడింది. అనేక ఫిర్యాదులు రావడంతో పోలీసు కమిషనర్ సాంగ్లియానా ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని, దేశంలో ఎక్కడైనా, ఏ పాఠశాల, ఏ కళాశాలలోనైనా చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని నిందితులు ప్రముఖ దిన పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 250 రూపాయలు, పరీక్ష ఫీజుగా 350 రూపాయలు పంపించాలని కోరారు. పరీక్షల్లో పాసైన విద్యార్థుల్లో 6240 మందిని ఎంపిక చేసి వారికి బంగారు, వెండి, కంచు పతకాలు ఇవ్వడంతో పాటు ప్రతి విద్యార్థికి 250 నుంచి ఐదు వేల రూపాయల వరకు స్కాలర్షిప్ ఇస్తామని ఆశ చూపారు. ఇందుకు గాను సోమాజిగూడాలో కార్యాలయం ప్రారంభించారు. స్కాలర్షిప్ల పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసుకుని పారిపోవడమే నిందితుల ఉద్దేశమని సాంగ్లియానా చెప్పారు.












Click it and Unblock the Notifications