ఓ దళిత సర్పంచి వస్త్రాపరహణం
హైదరాబాద్: మెదక్ జిల్లాల్లో ఓ దళిత మహిళ చీర ఊడదీసి బహిరంగంగా తీవ్రంగా కొట్టిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బాధితురాలు ఒక గ్రామ సర్పంచి కావడం, ఈ దారుణానికి పాల్పడిన వారు ఆ ఊరు అగ్రకులానికి చెందిన మహిళలే కావడం గమనార్హం. మెదక్ జిల్లా సిద్దిపేట దగ్గర్లోని పాములపర్తి గ్రామ సర్పంచి మంజుల ఇంటిపై అగ్రకులానికి చెందిన ఆరుగురు మహిళలు గత ఆదివారం నాడు దాడిచేసి ఆమె చీర ఊడదీశారు.
అనంతరం ఆమెను అలాగే బట్టలు లేకుండా కొట్టుకుంటూ..ఊరి మధ్యలోకి తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. వీరిని వారించేందుకు ప్రయత్నించిన మండల పరిషత్ సభ్యుడు గణేష్ ను కూడా గ్రామస్థులు చితకబాదారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించకుండా వారు నిరోధించారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడంతో విషయం పొక్కింది.
జిల్లా ఎస్పీ షికా గోయల్ జోక్యంతో సిద్దిపేట పోలీసులు గురువారం ఆ ఆరుగురు మహిళల(చాకలి నరసమ్మ, శివమ్మ, జ్యోతిస్వరూప, జ్యోతిపుష్పవ్వ, స్వరూప, రాములమ్మ)లపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం మంజుల ఆ గ్రామంలో కొన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. అవి నచ్చని జె.నరేందర్ రెడ్డి, మల్లారెడ్డిల ప్రోద్బలంతో ఈ మహిళలు ఈ దారుణానికి ఒడిగట్టారు.