ఆ మంత్రిని తొలగించండి: కాంగ్రెస్
హైదరాబాద్: క్రిమినల్ కేసులు ఎదుర్కుంటున్న రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి రామసుబ్బారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) డిమాండ్ చేసింది. శుక్రవారం జరిగిన పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. సమావేశం తీర్మానాలను పిసిసి ముఖ్య అధికార ప్రతినిధికె. రోశయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి నమ్మకం ఉంటే రామసుబ్బారెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి ఆవిషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డిసి)వివాద పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సమావేశం డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆర్డియస్పై ప్రభుత్వం చేయి దాటి పోయే దాకా చూస్తూ కూర్చున్నదని ఆయనవిమర్శించారు. ఈ విషయంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ను ప్రభుత్వం త్రోసి పుచ్చడాన్ని సమావేశం తప్పు పట్టిందని ఆయన తెలిపారు.
విషజ్వరాలతో పిల్లలు మరణించిన సంఘటనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు బాధ్యత వహించాలని సమావేశం అభిప్రాయపడింది. తీవ్ర నిర్లక్ష్యం వహించిన మంత్రి శివప్రసాదరావుపై ఏం చర్య తీసుకుంటున్నారో తెలియజేయాలని సమావేశం ముఖ్యమంత్రిని డిమాండ్ చేసింది. దాదాపు రెండున్నర గంటల పాటు నడిచిన ఈ సమావేశంలో ఆరు తీర్మానాలు చేశారు.