22న కాంగ్రెస్ ప్రాంతీయ కమిటీ
Posted on 21-11-03
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతీయ సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ కమిటీకి ఒక కన్వీనర్, 14 మంది సభ్యులుంటారని తెలుస్తోంది.
తెలంగాణకు ప్రాంతీయ కమిటీ వేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఫోరమ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కమిటీ ఏర్పాటుపై మాట్లాడడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గానీ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గానీ ఇష్టపడడం లేదు. అంతా అధిష్ఠానమే చూసుకుంటుందని శ్రీనివాస్ శుక్రవారం విలేకరులతో అన్నారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎఐసిసికి, పిసిసికి లోబడి పని చేస్తుందని అంటున్నారు.
తమ ప్రజాహిత బస్సు యాత్ర శనివారం కడప జిల్లాలో ప్రారంభమవుతుందని శ్రీనివాస్ చెప్పారు. ఈ యాత్రకు ఇద్దరు ఎఐసిసి పరిశీలకులు హాజరవుతారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లో 25వ తేదీన ముగుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తోనూ, వామపక్షాలతోనూ పొత్తులు ఒక నెల రోజుల్లో ఖరారు కాగలవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
