కాలేపై సస్పెన్షన్-విచారణ
Posted on 21-11-03
ముంబాయి: ఇండియా ఎ జట్టులో స్థానం కోసం ఇద్దరుసెలెక్టర్లకు పదేసి లక్షల రూపాయలు లంచం ఇవ్వజూపాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న మహారాష్ట్ర క్రికెటర్ అభిజిత్ కాలేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. లంచం ఇవ్వజూపిన సంఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)విచారణకు ఆదేశించింది.
భారత బార్ కౌన్సిల్ చైర్మన్ డి.వి. సుబ్బారావును విచారణ కమీషనర్గా నియమించినట్లు, ఈ కమీషనర్ పదిహేను రోజుల్లోగా నివేదిక సమర్పించనిట్లు బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా చెప్పారు. కమీషనర్ నివేదిక అందిన తర్వాత బోర్డు క్రమశిక్షణా సంఘానికి నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. బోర్డు నిర్ణయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్తో పాటు బిసిసిఐ అనుబంధ శాఖలన్నింటికీ పంపినట్లు ఆయన చెప్పారు. జాతీయ సెలెక్టర్లు ప్రణబ్ రాయ్, కిరణ్మోరేల నుంచి రాతపూర్వక నివేదికను తీసుకున్న తర్వాతనే విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు.