బహిరంగ చర్చకు వైయస్సై
Posted on 21-11-03
హైదరాబాద్: రాష్ట్రం ఈ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సవాల్విసిరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సాధించిన అభివృద్ధితో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని పోలుస్తూ ఎక్కడైనా ఎప్పుడైనా తాము బహిరంగ చర్చకు తాము సిద్ధంగా వున్నామని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనిమిదేళ్లు దివాళాకోరు విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. నక్సల్స్ను, కాంగ్రెస్ను ఒకే గాటన కట్టేసి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాము నక్సలైట్లతో చర్చలు జరపాలని అన్నామే తప్ప వారిని ఎప్పుడూ సమర్థించలేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు గత ఎనిమిదేళ్లుగా వేసిన పునాదిరాళ్లు సమాధి రాళ్లే అయ్యాయని, ఆ ప్రాజెక్టులు పూర్తి కాకుండానే కొత్తగా పునాది రాళ్లు వేస్తున్నారని ఆయన అన్నారు. అధిష్ఠానం వర్గం వద్ద చర్చలతో పార్టీలో గ్రూప్ తగాదాలు సమసిపోయాయని ఆయన చెప్పారు.