మంత్రులపై ఫిర్యాదు చేయలేదు: సివిసి
Posted on 22-11-03
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు గుంజుతున్నారంటూ తాను మంత్రులెవరిపై ఫిర్యాదు చేయలేదని ఛీఫ్ విజిలెన్స్ కమీషనర్ (సివిసి) శంకర్ స్పష్టం చేశారు. తమ ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆరుగురు కేంద్ర మంత్రులు డబ్బులు గుంజుతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రామ్నాయక్ వంటివారిపై తాను ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. గౌరవనీయమైన స్థానాల్లో పని చేస్తున్నవారి మీద తాను ఆ విధంగా చెప్పాననడం సరికాదని, రామ్నాయక్ వద్ద తాను పని చేశానని, ప్రధానితో తన భేటీకి పెడర్థాలు తీయవద్దని ఆయన అన్నారు. ఆరుగరు మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్రపతిని కోరింది.