ఆయుధాల స్వస్తిపై మలిదశ చర్చలు: వైయస్
న్యూఢిల్లీ: ఇక మీదట ఆయుధాల విసర్జనపై నక్సల్స్తో చర్చలు జరుగుతాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆయుధాలు విసర్జించే విషయంపై రెండో విడత చర్చలకు రావాలని తాము నక్సల్స్కు ఆహ్వానం పంపినట్లు ఆయన మంగళవారం విలేకరులతో చెప్పారు.
రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలనేది ప్రభుత్వం లక్ష్యమని, అందుకని ఆయుధాలు వదిలిపెట్టేందుకు అవసరమైన నియమాలను రూపొందించేందుకు చర్చలకు రావాలని నక్సలైట్లను ఆహ్వానించామని ఆయన చెప్పారు. వారి ప్రతిస్పందన కోసం తాము నిరీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. నక్సల్స్ ఆయుధాలు వదిలిపెట్టాల్సిందేనని, తద్వారా చర్చలకు అర్థం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఆయుధాలు వదిలిపెట్టేందుకు నక్సల్స్ నిరాకరిస్తున్నారు. భూమి సమస్యపై తొలి విడత చర్చలు జరిగాయని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. భూస్వాములు బలవంతంగా భూములు ఆక్రమించుకుంటే, అటువంటి భూములను తిరిగి పేదలకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. భూ స్వాధీనంలో జరిగిన అవకతవకలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ వేస్తోందని ఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
