గ్రామీణ వైద్యుల నియామకంపై అఖిల పక్షం: రోశయ్య
హైదరాబాద్: వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సరైన సేవలు అందించడానికి చేపట్టవలసిన విధానంపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన గురువారం శాసనసభలో సమాధానమిస్తూ ఆ విషయం చెప్పారు. శాసనసభలో ఉన్న దాదాపు 20 మంది వైద్యులను సమావేశపరిచి వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని తెలుగుదేశం సభ్యుడు ఉమామహేశ్వర రావు చేసిన సూచనకు మంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు వైద్యుల నియామకం జరుగుతూనే ఉన్నదని, అయితే వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం లేదని మంత్రి అన్నారు. వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడానికి వీలుగా నియామకం పద్ధతులను మారుస్తున్నామని, ప్రాంతాలవారీగా వైద్యుల ఇష్టాలను పరిగణనలోకి తీసుకుని వైద్యులు నియామకం జరుపుతామని ఆయన చెప్పారు. త్వరలోనే ఈ పద్ధతిలో వేయి మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లను నియమిస్తున్నామని ఆయన చెప్పారు. వైద్య రంగంలో 1055 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు.