వరంగల్ జిల్లాలో నలుగురు నక్సల్స్ హతం
వరంగల్: వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ప్రజా ప్రతిఘటన నక్సలైట్లు హతమయ్యారు. వరంగల్ జిల్లాలోని కంబాలపల్లి మండలం గరిమెళ్ల గ్రామం గుట్టలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఖమ్మం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ భావనా సక్సేనా చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో ప్రజా ప్రతిఘటన రాష్ట్ర నాయకుడు వేణుతో సహా నలుగరు మరణించినట్లు సమాచారం. ఖమ్మం, వరంగల్ జిల్లాల పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా నక్సల్స్ తమకు తారసపడ్డారని, దాంతో నక్సలైట్లను లొంగిపోవాల్సిందిగా కోరామని, తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా వారు కాల్పులు జరిపారని, ప్రతిగా తాము ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. మరో ముగ్గురు నక్సలైట్లు సంఘటనా స్థలంలో లొంగిపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయం నిర్ధారణ కావడం లేదు. సంఘటనా స్థలం నుంచి పది కిట్ బ్యాగులు, రెండు ఆయుధాలు, విప్లవ సాహిత్యం పోలీసుల చేతికి చిక్కాయి.
ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కమిటీ సభ్యుడు వేణుపై 17 కేసులున్నాయని వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. గత ఏడాది కాలంగా వేణు బలవంతంగా 30 లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆయన చెప్పారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఆదివాసీ లిబరేషన్ టైగర్స్కు చెందినవారు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఆయన అన్నారు.