పరిటాల అనుచరులను చంపుతాం: గోవర్ధన్ రెడ్డి
అనంతపురం: హత్యకు గురైన పెనుకొండ తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి అనుచరులను మరో రెండు నెలల్లో హతమారుస్తామని విప్లవ దేశభక్త పులుల సంస్థ ( ఆర్పీటి) నాయకుడు, పరిటాల హత్య కేసు నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అన్నాడు. పరిటాల అనుచరులు చమన్ను, పోతుల సురేష్ను రెండు నెలల్లో చంపుతామని అతను చెప్పాడు. జైలులోని విజిటర్స్ గ్యాలరీలో అతను మంగళవారం విలేకరులతో మాట్లాడాడు.
ఫాసిస్టు విధానాలను అనుసరించినందుకే పరిటాలను హత్య చేశామని గోవర్ధన్ రెడ్డి చెప్పాడు. మొద్దు శ్రీను లాంటి కార్యకర్తలు తమకు చాలా మంది ఉన్నారని, చమన్, పోతుల సురేష అజ్ఞాతంలోకి వెళ్లారని, వారి ఆచూకీ కోసం తమ అనుచరులు వెతుకుతున్నారని అతను చెప్పాడు. వారిద్దరిని చంపిన తర్వాత జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను లొంగిపోతాడని అతను చెప్పాడు. పరిటాల హత్య కేసులో మొద్దు శ్రీను ప్రధాన షూటర్ అని అనుమానిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, పెండింగ్ కేసుల్లో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని మంగళవారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మద్దెలచెర్వు గ్రామ కరణం లక్ష్మినారాయణరావు, అతని కుమారుడి హత్య కేసులో అతడ్ని కోర్టులు హాజరు పరిచారు. ఈ కేసులో సూరికి ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తగరకుంట ప్రభాకర్ రెడ్డి హత్య కేసులో సూరిని రేపు హాజరుపరచాల్సిందిగా కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications