మాట తప్పి ఆర్డీయస్పై ప్రాజెక్టు పనులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు సుబ్బారెడ్డి ఇచ్చిన మాట తప్పి రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీయస్)పై మినీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నియమించిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకు పనులు ఆపుతానని ఆయన ఇంతకు ముందు హామీ ఇచ్చారు. అందుకు విరుద్ధంగా ఆయన పనులు కొనసాగిస్తున్నారు. పిల్లర్లు వేయడమే కాకుండా పెద్ద యెత్తున నిర్మాణ సామగ్రిని ప్రాజెక్టు స్థలానికి తెచ్చారు.
భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థలానికి వస్తున్నారనే సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు మంగళవారం ప్రాజెక్టు స్థలానికి వెళ్లారు. వారికి నిర్మాణ పనులు కొనసాగుతుండడం కనిపించింది. వాహనాల రాకపోకలకు గాను వంతెన నిర్మిస్తున్నామని, ప్రాజెక్టు పనులు చేయడం లేదని కంపెనీ సూపర్వైజర్ ప్రకాశ్ మీడియా ప్రతినిధులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఒకరు మీడియా ప్రతినిధులపై మద్యం మత్తులో విరుచుకపడ్డారు.
ఆర్డీయస్పై మినీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపకపోతే పెద్ద యెత్తున ఉద్యమం చేపడతామని తెలుగుదేశం నాయకులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వారు మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అండదండలతోనే సుబ్బారెడ్డి విద్యుత్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదిక అందిందా, అందితే ఎందుకు బయటపెట్టరని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్డీయస్పై జలవిద్యుత్ ప్రాజెక్టును ఆపించడానికి ఏం చర్యలు చేపట్టారో తెలియజేయాలని వారు ముఖ్యమం6తిని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications