ఎన్కౌంటర్: తప్పించుకున్న 30 మంది
కర్నూలు: కర్నూలు జిల్లా ఎగువ పెన్నా అహోబిలం వద్ద పోలీసులకు, జనశక్తి నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నల్లమల అడవుల్లోని గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద నక్సల్స్ సమావేశమయ్యారనే సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద యెత్తున కూంబింగ్ చర్యలు చేపట్టారు. దాదాపు 2000 మంది పోలీసులు నక్సల్స్ కోసం వేట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు జనశక్తి నక్సల్స్ తారసపడ్డారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు కూడా కాల్పులు జరిగాయి. దాదాపు 30 మంది జనవక్తి నక్సలైట్లు ఈ ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
అయితే గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడే సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. రామకృష్ణను లక్ష్యంగా చేసుకునే పోలీసులు కూంబింగ్ చేపట్టినట్లు భావిస్తున్నారు. నల్లమల అడవుల్లోని అణువణువునా ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు జరుపుతున్నాయి.