ప్రాజెక్టులపై చర్చకు ముందే వాగ్బాణాలు
విజయనగరం/ హైదరాబాద్: తాము సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి, తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కడియం శ్రీహరి, పి. అశోక్ గజపతిరాజు, తదితరులు శుక్రవారం తోటపల్లి రిజర్వాయర్ స్థలాన్ని సందర్శించారు. పదవ తారీఖున హైదరాబాద్లో జూబిలీహాల్లో తోటపల్లి ప్రాజెక్టుపై బహిరంగ చర్చ జరుగనున్న నేపథ్యంలో వారు ఈ పర్యటనకు పూనుకున్నారు. బహిరంగ చర్చకు ప్రతి పార్టీ నుంచి ఐదుగురిని అనుమతించాలని శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడం తమ ధ్యేయం కాదని, అక్రమాలను నిలువరించాలన్నదే తమ ప్రయత్నమని ఆయన అన్నారు. ఒక్కరిని మాత్రమే అనుమతిస్తామనడం సరి కాదని ఆయన అన్నారు. టెండర్ల అక్రమాలపై చర్చ జరిగే ముందు అవగాహన కోసం ప్రాజెక్టును సందర్శించామని ఆయన చెప్పారు. నిర్వాసితుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీకి ఓ సిద్ధాంతం లేదని కాంగ్రెస్ శాసనసభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు శుక్రవారం హైదరాబాద్లో విమర్శంచారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఆయన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి చోటు చేసుకోకున్నా తెలుగుదేశం పార్టీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని భావించి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వం బహిరంగ చర్చకు ఆహ్వానించడాన్ని గుర్తు చేస్తూ ఆధారాలు ఉంటే ఆరోపణలను రుజువు చేయాలని ఆయన తెలుగుదేశం పార్టీని సవాల్ చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బహిరంగ చర్చ సందర్భంగా ఆరోపణలు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించడానికి వీలు కాదని ఆయన అన్నారు. తమకు ఎక్కువ సమయం కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడగడాన్ని చూస్తే ఆరోపణలు చేయాలనే ఉద్దేశ్యమే కాని వాస్తవాలు తెలుసుకోవాలనే ఉద్దేశం ఆ పార్టీకి లేనట్లు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.