అయ్యో.. నదిలో మునిగి ఒకే కుటుంబంలో 8 మంది మృతి
కర్ణాటకలో షాకింగ్ ఘటన జరిగింది. నదిలో మునిగి ఒకే కుటుంబంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 11 మంది గల్లంతు కాగా ఇప్పటివరకు 8 మంది మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగిలినవారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీళ్లంతా తత్తెహక్కలు నదిలో వేటకు దిగిన నేపథ్యంలో ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులందరినీ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలో ఉన్న బెంకెట్టిపుర(తట్టే హక్కలు) నదిలో వేటకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. నదిలో గుల్లలు ఏరుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దాంతో వాళ్లంతా నదిలో గల్లంతయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు 8 మంది మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో ఏడుగురు మహిళలే కావడం షాకింగ్.. ఈ మృతదేహాలను భట్కల్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉమేశ్ మంజునాథ్ నాయక్, లక్ష్మీ మహదేవ్ నాయక్, లక్ష్మి జట్టప్ప నాయక్, లక్ష్మి అప్పన్న నాయక్, జ్యోతి నాయక్, శివరామ్ నాయక్, మాలతి నాయక్, మస్తమ్మ నాయక్ గా గుర్తించారు.

ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో గుల్లలు ఏరుకుంటూ నదిలోని లోతైన ప్రాంతానికి వెళ్లిన పలువురు ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా విశ్లేషించాలని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇది అత్యంత విషాదకరమైన, బాధకరమైన ఘటన అని పేర్కొన్నారు. మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. గల్లంతు అయినవారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications