జెసి క్షమాపణ చెప్పాలి, లేకుంటే తిరగనివ్వం
హైదరాబాద్: హైదరాబాద్ విషయంలో మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ను తమ చెమట చుక్కలతో అభివృద్ధి చేశామని దివాకర్ రెడ్డి ప్రకటనకు తెలంగాణ మేధావులు, ఉద్యోగులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు జె.సి. దివాకర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు గురువారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో జె.సి. దివాకర్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధపడాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు విఠల్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రచయితల శ్రీధర్ దేశ్పాండే డిమాండ్ చేశారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన దివాకర్ రెడ్డి హైదరాబాద్లోనే పుట్టినట్లు మాట్లాడటం విడ్డూరమని వారన్నారు.
తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే దివాకర్ రెడ్డిని తెలంగాణలో తిరగనివ్వమని వారన్నారు. చరిత్రను తెలుసుకోకుండా దివాకర్ రెడ్డి మాట్లాడారని వారన్నారు. మరోవైపు సొంతగూటి నుంచి కూడా దివాకర్ రెడ్డికి వ్యతిరేకత ఎదురవుతోంది. హైదరాబాద్కు వచ్చి రాయలసీమ, ఆంధ్రా వారు అభివృద్ది చెందారే గానీ హైదరాబాద్ అభివృద్ధిలో వారి పాత్ర ఏమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి సి. జగన్నాథరావు, ఇతర సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూలంగా పరిశీలన చేస్తున్న సమయంలో దివాకర్ రెడ్డి ఆ విధమైన ప్రకటన చేయడం సరి కాదని వేరే విలేకరుల సమావేశంలో అన్నారు.