ముగ్గురిని చంపిన నక్సల్స్: ఒక నక్సల్ హతం
హైదరాబాద్: నక్సలైట్లు రాష్ట్రంలో వివిధ చోట్ల ముగ్గురిని హత్య చేశారు. పోలీసుల చేతిలో ఒక నక్సలైట్ హతమయ్యాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు మహేంద్రగౌడ్ను మావోయిస్టులు కాల్చి చంపారు. నక్సలైట్లను గమనించిన మహేందర్ గౌడ్ మోటార్ సైకిల్పై పారిపోతుండగా మావోయిస్టులు వెంటాడి కాల్చి చంపారు. మహేందర్ గౌడ్ కుటుంబ సభ్యులను బిజెపి నాయకులు దత్తాత్రేయ, జి. కిషన్ రెడ్డి, బద్దం బాల్ రెడ్డి పరామర్శించారు. ఈ హత్యను బిజెపి ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మణ్ ఖండించారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
మహేందర్ గౌడ్ హత్య జరిగిన ప్రాంతం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు శాంతి యాత్రను ప్రారంభించిన తక్కెళ్లపల్లికి దగ్గరలోనే ఉండడం విశేషం. మహేందర్ గౌడ్ను రాచకొండ దళం మావోయిస్టులు హత్య చేశారని పోలీసులు అంటున్నారు.
నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటలో ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టు నక్సలైట్లు ఒక వ్యక్తిని హత్య చేశారు. నక్సలైట్ల చేతిలో హతమైన దశరథం అనే ఈ వ్యక్తి మాజీ మిలిటెంట్. మాట్లాడడానికి అని చెప్పి దశరథంను బయటకు తీసికెళ్లి చేతులు వెనక్కి విరిచి కట్టేసి అతి సమీపం నుంచి కాల్చి చంపారు. వరంగల్ జిల్లా బుద్దారం ఉప సర్పించి గండ్ర రాజేశ్వర్ రావును జనశక్తి నక్సలైట్లు హత్య చేశారు.
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు నక్సలైట్లు రింటాడ జంక్షన్ వద్ద కల్వర్ట్ను పేల్చివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు పాక్షికంగా అంతరాయం కలిగింది.
గుంటూరు జిల్లా దాచేపల్లి పెదగార్లపాడు వద్ద పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కోపల్లి శీను అనే జనశక్తి నక్సలైట్ మరణించాడు. ఇతను మాచవరం మండల కేంద్రానికి చెందినవాడు. సంఘటనా స్థలం నుంచి 9 ఎం. ఎం. పిస్టల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనశక్తిలో శీను ప్రధానమైన వ్యక్తి అని గుంటూరు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ జితేంద్ర చెప్పారు.