వైయస్ బహిరంగ క్షమాపణకు మైసురా డిమాండ్
హైదరాబాద్: ప్రజాపథం కార్యక్రమాల సందర్భంగా మంత్రులు, శాసనసభ్యులు ప్రశ్నలడిగినవారిని చితకబాదడంపై బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎం.వి. మైసురా రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రజాపథం కార్యక్రమంలో సమస్యలు విన్నవించుకోవాలని చెప్పింది ముఖ్యమంత్రి అని, కాబట్టి ప్రజలను చితకబాదిన సంఘటనలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపథం ప్రజలను తన్నే కార్యక్రమంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ఓపిక ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల టెండర్లను ఖరారు చేయడం, డబ్బులను దండుకోవడం మీదనే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారని ఆయన విమర్శించారు.
తమ పార్టీ అనుబంధ కార్మిక సంఘం టియన్టియుసి ఇక చురుకుగా పని చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. మేడే సందర్భంగా పార్టీ కార్యాలయం ఎన్టీ ఆర్ ట్రస్టు భవన్లో ఏర్పాటయిన టియన్టియుసి సమావేశంలో మాట్లాడారు. అన్ని కార్మిక ఉద్యమాల్లో టియన్టియుసి పాల్గొంటుందని ఆయన చెప్పారు. కార్మిక ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. అసంఘటిత కార్మికుల పరిస్థితిపై దేశవ్యాప్త చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.