అసెంబ్లీ రద్దు తప్ప మార్గాంతరం లేదు: పియం
రాంతంబోర్ (రాజస్థాన్): శాసనసభ్యుల కొనుగోలుకు జరుగుతున్న బేరసారాలకు అడ్డుకట్ట వేయడానికి బీహార్లో శాసనసభను రద్దు చేయాల్సి వచ్చిందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. బీహార్ శాసనసభ రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కొట్టిపారేశారు. ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిచినా బీహార్లో ప్రభుత్వం ఏర్పడడం సాధ్యం కాలేదని ఆయన అన్నారు.
శాసనపభ్యుల కోసం జరుగుతున్న బేరసారాలు అసహ్యకరమైన స్థితికి చేరుకున్నాయని, ఈ విధమైన అవినీతికర చర్యలు దేశానికి చెడు పేరు తేకుండా చూడాల్సిన రాజ్యాంగ కర్తవ్యం ప్రభుత్వం ముందు ఉందని ఆయన అన్నారు. ఈ స్థితిలో గవర్నర్ తన సిఫార్సులను అందజేశారని, అసెంబ్లీని రద్దు చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని స్థితిగతులపై గవర్నర్ బూటాసింగ్ పలు నివేదికలు సమర్పించినట్లు ఆయన తెలిపారు.