సచిన్కు లండన్లో శస్త్రచికిత్స : 4 నెలలు విశ్రాంతి
న్యూఢిల్లీ: టెన్నిస్ ఎల్బోతో బాధపడుతున్న భారత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్కు లండన్లో శస్త్రచికిత్స జరిగింది. నిన్న లండన్లో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసి ఐ) కార్యదర్శి ఎస్.కె. నాయర్ బుధవారం ఇక్కడ విలేకరులతో చెప్పారు. దీంతో సచిన్ నాలుగు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ కారణంగా ఆయన శ్రీలంకలో ఆగస్టులో జరిగే ముక్కోణపు పోటీకి సచిన్ దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఎంతకాలం సచిన్ ఆటకు దూరంగా ఉండాల్సి వుంటుందనేది ఇప్పుడే చెప్పలేమని, సచిన్తో పాటు ఉన్న జట్టు ఫిజియో జాన్ గ్లోస్టర్ సమర్పించిన నివేదిక చూసిన తర్వాతనే ఏదైనా చెప్పగలమని ఆయన అన్నారు. ఈ నివేదిక ఇవాళ్ల అందవచ్చునని ఆయన చెప్పారు. రెండు రోజుల క్రితం టెండూల్కర్ లండన్లోని వైద్యుడ్ని సంప్రదించాడని, ఆ డాక్టర్తో పాటు ఫిజియో గ్లోస్టర్ శస్త్రచికిత్స అవసరమని భావించారని ఆయన వివరించారు. ఏడాది కాలంగా సచిన్ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఇప్పటికే సచిన్ మూడు ప్రధానమైన వన్డే టోర్నమెంట్లకు దూరం కావాల్సి వచ్చింది.