విజయశాంతి పుట్టుక ఎక్కడో!?: కడియం శ్రీహరి
హైదరాబాద్: స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను వేదికగా చేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమని సినీనటి విజయశాంతి అనడంపై ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా విమర్శించారు. విజయశాంతి ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. తన మూలాలామిటో విజయశాంతి చెప్పాలని ఆయన అన్నారు.
ఉద్యమాలు ఎవరైనా చేసుకోవచ్చునని, ప్రజలు ఏ మేరకు బలపరుస్తారనేదే ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణను రాజకీయ ప్రయోగాలకు వేదికగా మార్చుకోవడమే బాధాకరమని ఆయన అన్నారు. అందరూ తెలంగాణతోనే ప్రయోగాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
సమైక్యవాది అయిన చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టి తమతో చేతులు కలపాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకులు కె. యాదగిరిరెడ్డి, తదితరులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులను కోరారు.