విధుల్లో చేరిన జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించుకుని విధుల్లో చేరారు. హైకోర్టు ఆదేశం మేరకు వారు విధుల్లో చేరారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్ణీత కాలవ్యవధి కన్నా ఎక్కువ సమయం పని చేయాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణతో హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ అస్పత్రులకు పెద్ద యెత్తున రోగులు వచ్చారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను సోమవారంనాడు వింటామని, సమస్యల పరిస్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని హైకోర్టు చెప్పింది. రోగులకు ఇబ్బంది కలిగించకూడదని, అందువల్ల వెంటనే జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరాలని హైకోర్టు అన్నది.
సమ్మెను కొనసాగించాలని జూనియర్ డాక్టర్లు బుధవారం సర్వసభ్య సమావేశంలో నిర్ణయించుకున్నారు. అయితే అంతకు ముందు తాము సమ్మె విరమించి విధుల్లో చేరుతామని వారు హైకోర్టుకు తెలియజేశారు. తాము సమ్మె విరమించలేదని, స్వరూపం మార్చామని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకుడు సురేష్ చెప్పారు. ర్యాలీలు, ధర్నాలు చేయబోమని ఆయన చెప్పారు. తమ సమస్యలను హైకోర్టు తీర్చలేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.