నక్సల్స్తో చర్చలు జరుగుతాయి: జానా ఆశ
విజయవాడ: భవిష్యత్తులో నక్సలైట్లతో చర్చలు జరుగుతాయనే ఆశ ఉందని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. చర్చలు జరగడానికి నక్సలైట్లలోనూ, తమలోనూ చిత్తశుద్ధి వుండాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నక్సలైట్ల బెదిరింపుల వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) మంత్రులు రాజీనామాలు చేశారనేది వాస్తవం కాదని ఆయన అన్నారు. నక్సలైట్ల నుంచి ముప్పు ఉన్నవారికి తగిన రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చర్చల విషయంలో నక్సలైట్లకు అంగీకారంతో కుదిరితే సాఫీగా ఉంటుందని, ఆ సందర్భం కోసం చూస్తున్నామని ఆయన అన్నారు.
పోలీసులకు వేతన సవరణ సంఘంలో చేసిన సిఫార్సులు మెరుగ్గా ఉన్నాయని, కావాలంటే మరిన్ని వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే పోలీసులు సాహసోపేతంగా ఎలా వ్యవహరిస్తారని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు పోలీసులకు సంతృప్తి లేదని ఎలా చెప్పగలమని ఆయన అడిగారు.