వోక్స్ వ్యాగన్పై నిజాలు చెప్పాలి: టిడిపి డిమాండ్
గుంటూరు/హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో వాస్తవాలు వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 11 కోట్ల రూపాయలు తిరిగి రావడం ముఖ్యం కాదని, ఈ వ్యవహారంలో ఎవరెవరు సంతకాలు చేశారనేది బయటపడాలని ఆయన ఆదివారం గుంటూరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారం వల్ల రాష్ట్ర పరువుప్రతిష్ఠలు పోయాయని ఆయన అన్నారు.
వోక్స్ వ్యవహారంలో అక్రమాలకు షూష్టర్ మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, మంత్రి బొత్సా సత్యనారాయణ బాధ్యులని ఆయన అన్నారు. శవాలపై చల్లే పేలాలను మంత్రులు ఏరుకుంటున్నారని, ముఖ్యమంత్రి వారిని వెనుకేసుకొస్తూ కుంభకోణాల గురించి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఒక మంత్రిని కాపాడడానికి ముఖ్యమంత్రి రాష్ట్ర పరువుప్రతిష్టలను ఫణంగా పెట్టారని ఆయన విమర్శించారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో తమ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్పి) బయట పెట్టడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్. వేణుగోపాలచారి ఆదివారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. వోక్స్ వ్యాగన్తో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలను బయటపెట్టాలని తాము డిమాండ్ చేస్తే సిబిఐ దర్యాప్తు పేరు చెప్పి తప్పించుకుంటున్నారని, సిబిఐ దర్యాప్తు సాగుతుండగా సియల్పికి ఆ పత్రాలు ఎలా వచ్చాయని ఆయన అన్నారు.