తెలంగాణ ఒప్పందాన్ని కెసిఆర్ వెల్లడించాలి: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్తో చేసుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలని ప్రముఖ సినీనటి, తెలంగాణ ఉద్యమ నాయకురాలు విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. తాను ఇది వరకే ఆ డిమాండ్ చేశానని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రెండో ఎస్సార్సీకి ఒప్పుకుంటూ చంద్రశేఖర్ రావు ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారని ఆమె గుర్తు చేస్తూ ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలని టి ఆర్యస్ కార్యకర్తలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని అన్నారు.
తెలంగాణ హద్దులు కూడా తనకు (విజయశాంతికి) తెలియవని టిఆర్యస్ నాయకుడు ఎ. నరేంద్ర అన్నట్లు వచ్చిన వార్తను తాను ఇంకా చూడలేదని, చూసిన తర్వాత ప్రతిస్పందిస్తానని ఆమె అన్నారు. దేశంలో బిసిలు, ఎస్సిలు, ఎస్టీలు అణచివేతకు గురవుతున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రిగా బిసిని, ఉపముఖ్యమంత్రిగా ఎస్సిని చేయడానికి తాను కృషి చేస్తానని ఆమె చెప్పారు.