ఆర్టీసి అధ్యయనం పని ఐఐయంకు అప్పగింత
హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఆర్టీసి) పటిష్టతకు సూచనలు అందించాలని ప్రభుత్వం బెంగుళూర్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్మెంట్ (ఐఐయం)ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రెండు నెలల్లోగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఐఐయంకు విజ్ఞప్తి చేసింది. ఈ స్థితిలో ఐ ఐయం నివేదిక వచ్చే వరకు సమ్మెకు దిగవద్దని ప్రభుత్వం ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జె ఎసి)ని కోరింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సోమవారం మంత్రివర్గం ఉపసంఘం సభ్యులతోనూ, ఆర్టీసి అధికారులతో చర్చించారు.
ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను ప్రభుత్వం ఎల్లుండిలోగా హైకోర్టుకు సమర్పించాల్సి వుంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని జె ఎసి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ స్థితిలో కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు చర్చలు జరపాలని నిర్ణయం తీసుకుంది.