ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్- ఈ జిల్లాల్లో 48 గంటల పాటు వర్షాల హెచ్చరిక..!
బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంలోని పలు జిల్లాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం కాస్త చల్లబడింది. అదే సమయలో అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరానికి రాబోయే 48 గంటలు కీలకమని, ఈదురుగాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది.
ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ ఉదయం 5:30 గంటలకు అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

అలాగే ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్రం అలజడిగా నుంచి తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రానున్న 48 గంటల్లో మత్స్యకారులు ఉత్తర, మధ్య బంగాళాఖాతంలోకి.. అలాగే బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వెంబడి సముద్రంలోకి వెళ్లొద్దని ఐఎండీ సూచిస్తోంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. రాగల 3 గంటలు విశాఖ జిల్లాకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నగరంలోని నందపురం, కొమ్మాడి, ఎండాడ, సింహాచలం, గాజువాక, యారాడ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన చేసింది. తీరంలో 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచిస్తోంది.














Click it and Unblock the Notifications
