రెండేళ్లలో పులిచింతల పూర్తి: వైయస్ హామీ
విజయవాడ: కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం సాయంత్రం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పులిచింతల ప్రాజెక్టును చేపట్టకుండా ఎంతో మంది ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పులిచింతల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. పులిచింతల ప్రాజెక్టు స్థలమార్పిడిపై అధ్యయనం జరుగుతోందని, స్థలమార్పిడిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
వరద నష్టం జరకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. ఐదేళ్ల క్రితం కృష్ణా, గోదావరి నదులపై ఆనకట్టలు నిర్మించి ఉంటే ఈ ప్రమాదం ఉండేది కాదని ఆయన అన్నారు. విజయవాడ నుంచి ఉలిపిరిగడ్డ వరకు కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. వరద ముప్పు పూర్తిగా తొలిగేవరకు పునరావాస శిబిరాలను నిర్వహిస్తామని, ఆ తర్వాత కుటుంబానికి 20 కిలోలేసి బియ్యం ఇచ్చి పంపిస్తామని ఆయన చెప్పారు. వరదల్లో పూర్తిగా దెబ్బ తిన్న ఇళ్లకు 1500 రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బ తిన్న ఇళ్లకు 750 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన చెప్పారు.
కాల్వల ఆధునీకరణకు 1700 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల ఆధునీకరణ తర్వాత కృష్ణా డెల్టా కాలువల ఆధునీకరణకు చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల ఆధునీకరణకు 3 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. బిసి జనాభాపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. బిసి జనాభాపై తమ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావుకు అవగాహన లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications