వైయస్ మావోయిస్టులనూ మోసం చేశారు: బాబు
ఖమ్మం: నక్సలైట్లతో చర్చలు ఎందుకు విఫలమయ్యాయో, మళ్లీ నిషేధం ఎందుకు విధించాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రజలకు వివరించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. మొదట నక్సల్స్తో చర్చలు జరిపే సమయంలో ఆయుధాలు వదలాలనే షరతు పెట్టలేదని ఆయన ఖమ్మంలో అన్నారు. వైయస్ ప్రభుత్వం పేద ప్రజలనే కాదు, మావోయిస్టులనూ మోసం చేసిందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీని ఓడించడానికే నక్సలైట్లతో చర్చలు జరుపుతామని కాంగ్రెస్ నమ్మబలికిందని, అధికాంరలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని ఆయన అన్నారు. రాజకీయాల్లో సంస్కరణలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. మేధావులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు. సంస్కరణల ఫలితాలు పేదలకు అందాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆయన అన్నారు.