టిఆర్యస్ అగ్రనేతల వ్యాఖ్యలు అర్థరహితం: కెకె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) అగ్రనేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రల వ్యాఖ్యలు అర్థరహితమైనవని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. గాంధీభవన్లోని ప్రకాశం హాల్లో మంగళవారం జరిగిన పిసిసి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) నాయకురాలు అంబికా సోనీ, ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్యస్తో కలిసి పని చేయడానికి తాము ఎంతగానో ప్రయత్నించామని, అయితే ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. తెలంగాణపై అంతిమ నిర్ణయం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని, సోనియా నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శరాష్ట్రంగా తీర్చుదిద్దగలమని ఆయన అన్నారు.