బిల్లు పెడితే మా విధానం చెప్తాం: దత్తాత్రేయ
సంగారెడ్డి: పార్లమెంటులో బిల్లు ప్రాతిపాదిస్తే తెలంగాణపై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ విలన్ పాత్ర పోషిస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ భస్మాసుర హస్తం లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మోసం చేస్తుందని తెలిసీ తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) పొత్త పెట్టుకుందని, ఇప్పుడైనా చెంపలేసుకుని బయటకు రావాలని ఆయన అన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన టి ఆర్యస్ నేత కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ జాగరణ సేనను ఏర్పాటు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కార్యకర్తలతో లాఠీలు పట్టించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేతలు కెసి ఆర్, నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని ఆయన సలహా ఇచ్చారు.