వరదలు తగ్గాకే అంచనాలు కచ్చితం: వైయస్
హైదరాబాద్: వరదలు పూర్తిగా తగ్గిన తర్వాతనే కచ్చితంగా నష్టాన్ని అంచనా వేయగలమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. వరద తీవ్రతకు దెబ్బ తిన్న ఖమ్మం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడానికి బుధవారం ఉదయం బయలుదేరే ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో పాటు శ్రీహరికోట సందర్శనకు వెళ్లాల్సిన రాజశేఖర్ రెడ్డి దాన్ని రద్దు చేసుకుని ఏరియల్ సర్వేకు బయలుదేరారు. ప్రధానికి గవర్నర్ సుశీల్కుమార్ షిండే తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం చెప్పారు. తుఫాను తాకిడి వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని గవర్నర్ ప్రధానికి వివరిస్తారని రాజశేఖర్ రెడ్డి చెప్పారు.
అంతకు ముందు శ్రీకాకుళం జిల్లాలను అతలాకుతలం చేసిన తుఫాను ప్రభావం మంగళవారంనాడు కృష్ణా, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఆయన అన్నారు. దాదాపు రెండు లక్షల ఎకరాల వరిపొలం నీట మునిగిందని, ప్రాణ నష్టం కూడా భారీగానే జరిగిందని ఆయన చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టిందని, కృష్ణానది ఉధృతంగా ప్రహిస్తోందని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలో 2,900 కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 7340 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.