కెసిఆర్, నరేంద్రలపై ఎఫ్ఐఆర్: కోర్టు ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేతలు, కేంద్ర మంత్రులు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా హైదరాబాద్లోని నాంపల్లి మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తెలంగాణ జాగరణ సేన (టిజెయస్) ఆవిర్భావం సందర్భంగా హింసను ప్రేరేపించే విధంగా వారు వ్యాఖ్యలు, ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలేవీ తీసుకోకపోవడంతో కొంత మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
టిజెయస్ కమాండర్ ఉమాకాంత్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కెసిఆర్, నరేంద్రలు హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు పిట్ల కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు పెద్దగా స్పందించలేదు. నరేంద్రపై వచ్చిన ఫిర్యాదు మీద విచారణ జరుగుతోందని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ ఇటీవల మీడియా ప్రతినిధులతో చెప్పారు.
కోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రతినిధితో అన్నారు.