కృష్ణాగోదావరుల ఉధృతి: దివిసీమకూ ముప్పు
హైదరాబాద్: గోదావరి నదితో పాటు కృష్ణానది కూడా ఉప్పొంగుతోంది. దీంతో దివిసీమకు, కోనసీమకు ముప్పు పొంచి ఉంది. విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. విజయవాడలోని రీజినల్ సైన్స్ సెంటర్ నీట మునిగింది. ఇది పూర్తిగా నీట మునిగి ప్రమాదం పొంచి వుంది. ఇది పూర్తిగా నీట మునిగితే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నీట మునిగింది. వరదలకు ఇప్పటి వరకు 59 మంది మరణించి వుంటారని అంచనా. అయితే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో ఏడుగురు, నల్లగొండ జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, మహబూబ్నగర్ జిల్లాలో ముగ్గురు, వరంగల్ ఒకరు, మెదక్, గుంటూరు జిల్లాలో ఇద్దరు మరణించారు.
పై నుంచి వదిలిన నీటితో పాటు మున్నేరు వాగు ద్వారా కూడా నీరు చేరుతుండడంతో కృష్ణా బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. వరంగల్ జిల్లాలోని డోర్నకల్ వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ను పునరుద్ధరించే పనులు సాగుతున్నాయి. విజయవాడ, హైదరాబాద్ల మధ్య ఇబ్రాహీంపట్నం వద్ద జాతీయ రహదారిపై పెద్ద యెత్తున నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ 18 గేట్లను ఎత్తివేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 50 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. విజయవాడ సమీపంలోని బుడమేరు కట్ట తెగడంతో సింగ్నగర్, కండ్రిగ మునిగిపోయాయి.
కరీంనగర్ జిల్లాలో కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్లోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే బస్సులను నల్లగొండ జిల్లా కోదాడ వరకు మాత్రమే నడుపుతున్నారు. వరంగల్కు కరీంనగర్ మీదుగా బస్సులను నడుపుతున్నారు. గుంటూరు జిల్లాలో కూడా వరద ఉధృతి పెరుగుతోంది. మూడు లంక గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల ప్రజలను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారిని రక్షించేందుకు ప్రత్యేకంగా మరబోట్లను నియోగిస్తున్నారు. కొండవీటివాగు పొంగిపొర్లుతోంది. దీంతో గొడవర్రు కాలువకు గండి పడింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణకు వరద ముప్పు తాకుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే వంతెన నీట మునిగింది.












Click it and Unblock the Notifications