బిసిసిఐ ఎజియం నిరవధిక వాయిదా
కోల్కత్తా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజియం) నిరవధికంగా వాయిదా పడింది. కోర్డు ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయితే తప్ప సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించలేమని బోర్డు తెలియజేసింది. దీనిపై కేంద్ర మంత్రి శరద్ పవార్ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తానని శరద్ పవార్ అన్నారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఎన్నికల నిర్వహణకు మరో ఇద్దరు పరిశీలకులను కోల్కత్తా హైకోర్టు నియమించింది. ఇప్పటికే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుహాస్ చంద్రసేన్ను కోర్టు పరిశీలకుడిగా నియమించింది. ఈయనకు తోడు మరో ఇద్దరిని హైకోర్టు పరిశీలకులుగా నియమించనుంది. అంగీకారం తీసుకున్న తర్వాత ఆ ఇద్దరు పరిశీలకుల పేర్లు ప్రకటించనున్నట్లు జస్టిస్ సౌమిత్ర సేన్ తెలిపారు.
ఆ ఇద్దరు పరిశీలకుల అంగీకారం పొందిన తర్వాత ఈ సాయంత్రం లేదా రేపు ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. బిసిసిఐ ఎన్నికలకు వోటర్ల అనర్హత, అర్హతలకు సంబంధించిన వివాదాలను ఈ ముగ్గురు పరిశీలకుల ప్యానెల్ పోలింగ్కు ముందే నిర్ణయిస్తుంది. పరిశీలకుల మధ్య విభేదాలు ఉంటే మెజారిటీ అభిప్రాయం అమలవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, ఎన్సిపి నేత, కేంద్ర మంత్రి శరద్పవార్ బిసిసిఐ అధ్యక్ష పదవికి పోటీకి దిగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నామినీగా ఆయన పోటీ చేయబోతున్నారు.