మాపై కేసులు వైయస్ కుట్రే: నరేంద్ర
మెదక్: తమపై కేసులు పెట్టడం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుట్రేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తదుపరి సంభవించే పరిణామాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమపై కేసులు పెట్టడాన్ని ఆహావ్నిస్తున్నామని ఆయన చెప్పారు. తమను అరెస్టు చేసిన తర్వాత భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు. తమపై కేసుల విషయాలను కోర్టులోనే తేల్చుకుంటామని ఆయన అన్నారు. కోర్టు నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్వయంగా పూనుకొని తమపై కేసులు పెట్టేలా చేశారని ఆయన అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్యస్యస్) కార్యకర్తలు కర్రలు పట్టగా లేనిది తాము పడితే తప్పు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తే తాము ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకే వదిలేశామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్రెడ్డి అనడం మున్పిపల్ ఎన్నికల ఎత్తుగడ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) పార్టీల అభిప్రాయం అడగడం అర్థరహితమని ఆయన అన్నారు. బీహార్ ఎన్నికల తర్వాత సోనియాతో తెలంగాణపై తాడో పేడో తేల్చుకుంటామని ఆయన చెప్పారు.