హైదరాబాద్లో సునామీ హెచ్చరికల కేంద్రం
న్యూఢిల్లీ: సముద్ర విపత్తులను ముందుగా గుర్తించే హెచ్చరికల కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సునామీ, తుఫానుల వంటి సముద్ర విపత్తులను గుర్తించే ఈ వ్యవస్థను 2007 నాటికి హైదరాబాద్లో నెలకొల్పుతారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గురవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హిందూ మహాసముద్రంలో సంభవించే విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరికలు ఇవ్వడానికి ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఈ వ్యవస్థ ఏర్పాటుకు 125 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, దీన్ని హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వద్ద నెలకొల్పుతామని ఆయన చెప్పారు. సముద్రంలో సంభవించేబోయే విపత్తులపై 100 వ్యాసార్థంలోని వంద కోస్తా గ్రామాలకు ఈ కేంద్రం ఐదు నిమిషాల్లో హెచ్చరికలు చేస్తుందని ఆయన చెప్పారు. అత్యధునాతనమైన ఈ వ్యవస్థ జపాన్, చిలీలలో మాత్రమే ఉన్నదని ఆయన చెప్పారు.