170 జీవోను సవరించాలి: టిఆర్సిసిసి
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు కృష్ణా నది జలాలను తరలిస్తూ జారీ చేసిన 170 నెంబర్ ఉత్తర్వులను సవరించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. 170 నెంబర్ జీవోలో 69 నెంబర్ జీవోను చేర్చాలని టిఆర్సిసిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు సమక్షంలో సోమవారం టిఆర్సిసిసి నాయకులు సమావేశమయ్యారు.
అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి గోదావరి నదిపై ఇచ్చంపల్లి, ప్రాణహిత ప్రాజెక్టులను చేపట్టాలని టి ఆర్సిసి ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ ప్రాంతం నీటి కేటాయింపులపై అధ్యయనానికి ఒక నిపుణుల కమిటీ వేయాలని కూడా సూచించింది. 170 జీవో వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టుకు నష్టం జరగకుండా చూడాలని టిఆర్సిసిసి అభిప్రాయపడ్డారు. నీటి విడుదల విషయంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని టిఆర్యసిసి అభిప్రాయపడింది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ సామర్థ్యం పెంచడంపై కొన్ని అపోహలు ఉన్న మాట నిజమేనని టి ఆర్సిసిసి అభిప్రాయపడినట్లు పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.