అల్పపీడనంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
హైదరాబాద్: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో దక్షిణ కోస్తాలో, రాయలసీమలో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారవర్గాలు అంటున్నాయి. తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడవచ్చు. చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సముద్ర తీరంలో పరిస్థితి కాస్తా ఆందోళనకరంగానే ఉంది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు మత్స్యకారులను హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయవాడలో భారీ వర్షం కురిస్తోంది. దీంతో రోడ్లపై నీళ్లు చేరాయి. ఈ కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి.