సమన్వయ కమిటీ సమావేశాలకు లెఫ్ట్ హాజరు
న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ), వామపక్షాల సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కావాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బిహెచ్ఇయల్) వాటాలను విక్రయించకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో వామపక్షాలు గురువారం ఆ నిర్ణయానికి వచ్చాయి. సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు అబానీ రాయ్, ఫార్వర్డ్బ్లాక్ నాయకుడు దేవవ్రత బిస్వాస్ ఆ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
సమన్వయ కమిటీ సమావేశాలను బహిష్కరించాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ జూన్ 26వ తేదీన తాము రాసిన లేఖకు యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ సమాధంగా రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్నామని ప్రకాశ్ కారత్ చెప్పారు. బిహెచ్ఇయల్, ఇతర నవరత్న కంపెనీల వాటాలను విక్రయించబోమని ప్రధాని మన్మోహన్ సింగ్ ఇదివరకు హామీ ఇచ్చారని, ప్రభుత్వ నిర్ణయాన్ని సోనియా గాంధీ కూడా తమకు తెలియజేశారని ఆయన వివరించారు. ఈ స్థితిలో తాము సమన్వయ కమిటీ సమావేశాలకు హాజరు కావాలని నర్ణియించుకున్నామని ఆయన చెప్పారు.