సియం ఇంటిపై దాడి: తీవ్రవాదుల హెచ్చరిక
బెంగుళూర్: బెంగుళూర్లో మరిన్ని దాడులకు పాల్పడతామని తీవ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు పోలీసులకు, మీడియా కార్యాలయాలకు లేఖలు వచ్చాయి. ముఖ్యమంత్రి ధరంసింగ్ నివాసంపై, ఒక ఫైవ్ స్టార్ హోటల్పై కొత్త సంవత్సరం సందర్భంగా బాంబు దాడులు చేస్తామని తీవ్రవాదులు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి నివాసంపై దాడి చేయడానికి ఇద్దరు మానవ బాంబులు సిద్ధంగా ఉన్నారని, దేశంలో కనీవినీ ఎరగని రీతిలో ఈ బాంబు దాడి జరుగుతుందని మొయినుద్దీన్ అనే వ్యక్తి పేర ఈ లేఖలు అందాయి. ఆల్ జిహాదీలపై దాడులు ఆపేయాలని అతను పోలీసు కమీషనర్ను కోరారు. ముఖ్యమంత్రిని, పోలీసు కమీషనర్ను సంబోధిస్తూ రాసిన ఈ లేఖలు పత్రికా కార్యాలయాలకు ఫాక్స్ ద్వారా అందాయి. పోలీసులకు అటువంటి లేఖలు అందాయని జాయింట్ పోలీసు కమీషనర్ (క్రైమ్) ఎం.సి. నారాయణ గౌడ చెప్పారు.
తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికార నివాసం అనుగ్రహకు భద్రతను పెంచారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టూ సెక్యూరిటీ కవర్ను ఏర్పాటు చేస్తున్నట్లు డిజిపి బి.యస్. సియాల్ చెప్పారు. ముఖ్యమంత్రి నివాసానికి వచ్చే ప్రతి ఒక్కరినీ, మంత్రులు, శాసనసభ్యులను, అధికారులను కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తామని ఆయన చెప్పారు.
తీవ్రవాదులు దాడి చేస్తామని చెప్పిన గ్రాండ్ అశోక హోటల్ ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెనక, ఆయన కార్యాలయం కృష్ణాకు పక్కన ఉంది. గ్రాండ్ అశోక వద్ద కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.